"నకర్మణా నప్రజయాధనేన త్యాగేనైక అమృతత్వ మానశుః." ఇది వేదములోని ప్రధాన మంత్రము. నీవు ఎన్ని సత్కర్మలు ఆచరించినప్పటికిని, ఎన్ని విధములైన ఐశ్వర్యాన్ని అభివృద్ధి పరచినప్పటికిని, సిరిసంపదలతో తులతూగుతున్నప్పటికిని ఇవన్నీ ఆస్థిరములు, అశాశ్వతములు, ఇవన్నీ నీకు అమృతత్వాన్ని అందించవు. త్యాగమొక్కటే అమృతత్వమును అందించునది, ఏది త్యాగము? ఆస్తిపాస్తులను, ఆలుబిడ్డలను త్యాగం చెయ్యటమా? కాదు కాదు. నీకు బంధన ఏమిటి? బంధన ఏమిటో గుర్తించినప్పుడే ఆ బంధన విసర్జించటానికి తగిన కృషి చేస్తావు, దేహమనే (భాంతయే ఒక పెద్ద బంధన. నేనే దేహమనే భావమును విసర్జించాలి. అప్పుడే మోక్షము లభిస్తుంది. దేహ భ్రాంతి వదలి పెట్టి, ఆత్మభ్రాంతిలో కూడటమే బంధవిమోచన, దేహవిరక్తి,, దైవ ఆసక్తి, ఈ రెండింటి సమీప సంబంధముచేత బంధవిమోచన, మోక్ష ప్రాప్తి, రెండు సంభవిస్తాయి.
(బృత్ర.పు. ౧౬౧)
మనదుర్గుణాలను త్యాగం చేయటమే నిజమైన త్యాగము
(బృత్ర. పు. 983)
రాముడు అరణ్యానికి వెళ్ళే ముందు సర్వసంపదలను బీదలకు దానం చేశాడు. సీత కూడా తన నగలను ఆభరణాలను బీదలకు దానం చేసి, నారవస్త్రములను ధరించి రామునివెంట అరణ్యానికి బయలుదేరింది.ఈ విధంగా, సీత తన సర్వ సంపదలను త్యాగం చేసినప్పుడు రాముణ్ణి పొందగలింది. కాని, అరణ్యానికి వెళ్ళిన తరువాత ఏనాడూ బంగారాన్ని కోరని సీత బంగారు లేడిని ఆశించింది. బంగారు లేడిపై ఆమెకు ఎప్పుడు ఆశ కల్గిందో అప్పుడు ఆమె రామునికి దూరమైనది. దీని అంతరార్థమేమనగా, వాంఛల చేతనే మానవుడు బంధితుడౌతున్నాడు; భగవంతునికి దూరమౌతున్నాడు. కనుక, భగవంతుడు లభ్యం కావాలంటే వాంఛలను త్యాగం చేయాలి. దీనిని పురస్కరించుకొనియే వేదము "నకర్మణా నప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వ మానశుః" అన్నది. రామాయణము నుండి ముఖ్యంగా నేర్చుకోవలసింది త్యాగనిరతి. రామాయణంలోని ఇలాంటి పవిత్రమైన ధర్మ సూక్ష్మములను గ్రహించి ఆచరణలో పెట్టినప్పుడే మీ జీవితం సార్థకమౌతుంది.
(స.సా. మే 2000 పు.148)
నిండు సభలో ద్రౌపదిని పరాభవించుటకు దుర్యోధన, దుశ్శాసనులు పూనుకున్నప్పుడు ఆమె “కృష్ణా ! కృష్ణా !" అని ప్రార్థించగా కృష్ణుడా ప్రార్థన విని ఆమెను తాను రక్షించడానికి ఏ పవిత్ర కర్మలు చేసింది? అని యోచించాడు. అతనికి ఒక సంఘటన స్ఫురించింది. ఒక భోగి పండుగనాడు ద్రౌపది, సత్యభామ, రుక్మిణి మొదలగువారు పరివేష్టించియుండగా కృష్ణుడు చెరుకును కోయడానికి ప్రయత్నించినప్పుడు అతని వేలు కోసుకుని రక్తం స్రవించింది. దానిని నివారించడానికి రుక్మిణి, సత్యభామలు దాసీలను రకరకాలుగా ఆజ్ఞాపిస్తూ తొందర పడసాగారు. కాని, ద్రౌపది వెంటనే తాను కట్టుకున్న నూతన వస్త్రాన్ని చించి కృష్ణుని వేలికి కట్టింది. ఆనాడు ద్రౌపది చేసిన త్యాగానికి ఫలితంగా కృష్ణుడు ఆమెకు అక్షయ వలువ లిచ్చి ఆమె మానం కాపాడాడు. కనుక, మీరు చేసే కర్మలను బట్టి భగవంతుడు ఫలాన్ని అందిస్తాడు. త్యాగంవల్లనే దైవానుగ్రహాన్ని పొందడానికి వీలౌతుంది.
(స.సా.జాన్.2000 పు. వెనుక కవరు)
భావమందున తుచ్ఛవాంఛలు వీడుట
త్యా గమగును - అదియే యోగమగును
ఆస్తి, ఆలివీడి, యడవి కేగుట కాదు
ఉన్నమాట చెప్పుచున్నమాట
(సా|| పు. 234)
మానవుని ప్రత్యేక గుణము త్యాగము. దాని ద్వారా కలుగు ఫలితమేమిటి? "నకర్మణాన ప్రజయా ధనేన | త్యాగేనైక అమృతత్వ మానశుః". అమృతత్వము అందుకొనుటకై మానవుని ధర్మస్వ రూపమును త్యాగము దర్శించినది. అయితే త్యాగమును మానవుడు కోల్పోయి దానికి విరుద్ధమైన స్వార్థమునే వరించినాడు. ఈ స్వార్థమును వరించినప్పుడు పరార్థము శూన్యమై పోయింది. పరార్థము ‘శూన్యమై పోయినప్పుడు అర్థము మిగిలిపోయింది. ఈ అనర్ధములతో అనేక అశాంతులు అనుభవించుచున్నాడు. నేటి మానవుడు. ఈనాటి విద్యార్థులు యదార్థమును గుర్తించి, సత్యాన్ని పొందటానికి ప్రయత్నించాలి.
(సా॥ పు. 602)
ఈనాడు మనము చేయవలసిన త్యాగము కేవలము ధనమును మాత్రమే కాదు. మనలో ఉన్న దుర్గుణాలను త్యాగం చేయాలి. మన దుర్గుణములను త్యాగం చేయుటమే నిజమైన త్యాగము. అంతేకాని, ఆస్తిని, ఆలిని వీడి ఆడివికేగుట కాదు. భావమందు దుష్టభావములు వీడుటే త్యాగమగును; అదియె యోగమగును. అప్పుడే మానవత్వము పరిపూర్ణత్వము కాగలదు.
(శ్రీ భ.ఉ.పు. 114)
వ్యాసుడు బోధిస్తూ ఉంటే వినాయకుడు మహాభారతమును వ్రాస్తూ వచ్చాడు. తన వ్రాతకు ఏదీ అడ్డు కలుగ కుండా ఉండాలని తానెంతగానో ప్రయత్నించాడు. కాని, మధ్యలో కలము కూలి పోయింది. తక్షణమే తన దంతమును పెరికి దానినే కలముగా తీసుకొని వ్రాస్తూ వచ్చాడు. అనగా, జ్ఞానమునకు తన దేహమునైనా త్యాగం చేసి ఆదర్శాన్ని అందిస్తూ వచ్చాడు. కాని, ఈనాడు జ్ఞానమునకు మనమేమి త్యాగం చేయుట లేదు. అజ్ఞానాంధకారమునకు మాత్రం సర్వమునూ త్యాగం చేస్తున్నాము! నిత్యమూ గృహములో దైవానికి పెట్టే నైవేద్యం కూడా తిరిగి తనకే దక్కునన్న ఉద్దేశ్యంతో పెడుతున్నాడు కాని, నిజంగా భగవంతుడు అంతో ఇంతో తింటే మానవుడు నైవేద్యం కూడా పెట్టేవాడు కాదు! ఈ విధమైన స్వార్థ బుద్ధితో మానవుడు పూజలు, పునస్కారములు సల్పుతున్నాడు. ఇటువంటి ఇంక నూరు జన్మల పాటు చేసినప్పటికీ ఫలితం ఏమాత్రమూ దక్కదు. బాహ్యమైన మార్పులు జరిగినంతనే అంతరానందము లభ్యము కాదు. మనస్సు మారాలి, హృదయము మారాలి, ఆధ్యాత్మిక దివ్యత్వములో లీనమై పోవాలి.
(స.సా.న., 93 పు. 294)
ఈనాడు మీకొక ఆనందకరమైన విషయాన్ని చెపుతున్నాను. ఐతే, నాకెప్పుడూ ఆనందమే! ఇది ఆనందము, అది దుఃఖము. ఇది శుభవార్త, అది అశుభవార్త అనే భేదం నాకు ఏనాడు లేదు. అన్ని శుభమే! శుభాశుభములు రెండూ మనస్సు కలవానికే! నాకు శుభము, అశుభము ఒక్కటే! రాత్రి న్యూయార్క్ నుండి ఒక communication వచ్చింది. ఏమని? "స్వామి చేసే సత్కర్మలు, స్వామి చేసే సేవలు, స్వామి స్థాపించిన ఆసుపత్రి ప్రభావము జగద్వ్యాపి అయినవి. దీనిని భారతీయులే గుర్తించడం లేదు. ఏవిధమైన ప్రచారమూ చేసుకోకుండా ఆచరణ రూపంలో మీరు సహాయము నందిస్తున్నారు. మీరు చేస్తున్నటువంటి సేవలు ప్రపంచంలోనే ఎక్కడా జరగటం లేదు. ఇలాంటి సేవల కయ్యే ఖర్చులో ఏ కించిత్ భాగమైనా మేము భరించడానికి అవకాశము నందించాలని కోరుతున్నాము" అంటూ వారు నూరు కోట్ల రూపాయలు సత్యసాయి ట్రస్టు పంపించారు. అంతేకాదు, ఇది కేవలం First instalment (మొదటి విడత) అని, small token of love అని పేర్కొన్నారు. ఇందులో యాభై కోట్లు ఆసుపత్రి పేరుతో fixed deposit లో పెట్టి దానిపై వచ్చే ఆదాయంతో ఆసుపత్రి చక్కగా జరుగుతూ రావాలని కోరారు. ఇంకా 25 కోట్లు విద్యాసంస్థ పేరుతో పెట్టి ఈ విద్యావిధానంలో నూతనమైన విలువలను అభివృద్ధి పరచి నిజమైన విద్యా స్వరూపాన్ని నిరూపించాలని అన్నారు. మధ్య మధ్య స్వామి చేసేటటువంటి ప్రాకృతమైన సహాయము లెన్నో ఉంటుంటాయి. వాటికంతా 25 కోట్లు సెంట్రల్ ట్రస్ట్ పెట్టుకోవాలని కోరుతూ, ఇది కేవలం first instalment అని వ్రాసారు.
"స్వామి చేస్తున్న సత్కర్మలలో భాగం వహించే మహద్భాగ్యం మాకు లభించటం, దానికి స్వామి అంగీకరించటం మా అదృష్టం. మాకు పేరు ప్రధానము కాదు. కనుక, మా పేరు ఎవ్వరు చెప్పకూడదు. మాకు సేవయే ప్రధానము. అందులో సాక్షాత్తు భగవంతునికి చేసే సేవ మహాపవిత్రమైనది" అని పేర్కొన్నారు. ఇదే నిజమైన త్యాగము. ఈనాడు ఎవరైనా పది రూపాయలు దానం చేస్తే నా తలంత అక్షరాలతో న్యూస్ పేపర్స్ - పబ్లిష్ చేస్తుంటారు. ఈనాటి వరకూ మేము ఎవ్వరిని ఒక్క నయా పైసా అడుగలేదు. కారణమేమి? నిస్స్వార్థ సేవయే పవిత్రమైన ఫలితాలనందిస్తున్నది. కనుక, మీరు కూడా నిస్స్వార్థ సేవ చేయండి. దానికి తగిన సహాయం దానంతటదే వరించి వస్తుంది. దీనికి ఏమాత్రమూ సంకోచించ నక్కరలేదు. మనం చేసేపని హృదయ పూర్వకంగా చేయాలి. మానసిక తృప్తిగా చేయాలి. ఆ తృప్తియే మనకు సర్వ సౌఖ్యములనూ అందిస్తుంది, సర్వశక్తి ని చేకూర్చుతుంది. ఇదే నిజమైన గుణం. ఇట్టి గుణమే నిజమైన ధనము.
ప్రేమ స్వరూపులారా...! సత్యసాయి సంస్థల ప్రభావం జగద్వ్యాప్తి అయిపోయింది. కాని, దురదృష్టవశాత్తు భారతీయులకు ఈ "దీపము" క్రింద ఉన్న క్రీనీడ మాత్రమే కనిపిస్తున్నది. యావత్ప్రపంచమంతా దీని వెలుతురులో ఆనందాన్ని అనుభవిస్తున్నది. దానికి వారి విశ్వాసమే మూలకారణము. కాని మనకు విశ్వాసం వస్తుంది, పోతుంది...!. .
"విశ్వాసమెక్కడో ప్రేమ అక్కడ
ప్రేమ ఎక్కడో శాంతి అక్కడ
శాంతి ఎక్కడో సత్యమక్కడ
సత్యమెక్కడో ఆనందమక్కడ
ఆనందమెక్కడో దేవుడక్కడ"
కనుక, విశ్వాసమే లేకపోతే ఆనందం ఎక్కడి నుండి వస్తుంది? కొంతమంది ఏదైనా విచిత్ర మైన చర్యలు చూసినప్పుడు మాత్రం మహాభక్తి ఏర్పడుతుంది. కాని మరునిమిషంలోనే తిరిగి మార్పు కలుగుతుంది. ఇది సరియైన విశ్వాసం కాదు. విశ్వాసమనేది రాక పోకలు లేని స్థిరమైన గుణము; కదలిపోయే మేఘము కాదు. హరిశ్చంద్రునికి ఎన్ని కష్టములు కలిగాయి!! "అయ్యో! సత్యకోసం నేనెంత పాటుపడితినే! నాకు కలిగిన ఫలిత మీదా....? అని ఏమాత్రం విచారించలేదు. భగవంతుడిదే ఇచ్చినప్పటికీ దానిని ప్రసాదంగా భావించి అనుభవించాడు. కనుకనే, కట్టకడపటికి అతని భార్య. మరణించిన కుమారుడు, పోయిన రాజ్యము తిరిగి వచ్చాయి. ఇలాంటి స్థిర చిత్తములో మనము జీవితాన్ని గడపాలి.
నిన్నటి దినమున అందిన ధనమును శాశ్వతమైన కార్యక్రమాలలో ప్రవేశ పెట్టాలని నిర్ణయించుకొన్నాను. ఇంకా ఎంతో అభివృద్ధిని సాధించాలని సంకల్పించు కొన్నాను. నా సంకల్పములకు ఏనాడూ భిన్నం కాదు, స్వామి సంకల్పం వజ్ర సంకల్పం. దీనిని ఎవ్వరూ మార్చటానికి వీలు కాదు. స్వామి యొక్క ప్రభావము కాని, పవిత్రత కాని, కీర్తి కాని కేవలం ప్రచారంతో వచ్చినవి కాదు, స్వామి యొక్క ఆచరణ చేత వచ్చినవే! నాకు ప్రచారం అక్కరలేదు, ఆచరణే చాలా అవసరం. ప్రచారంలో వచ్చినది ప్రచారం తోనే పోతుంది. కాబట్టి, నా పేరు పోవాలని ఎంతమంది ఎన్ని ప్రచారములు చేసినప్పటికి పోవటానికి వీలేకాదు. కాగితంపై చిత్రింపబడిన పూలతీగ గాలికి కదులుతుందా? అదేవిధంగా లోక భావములు చేత, లోక ప్రచారముల చే లోకమే కదలవచ్చు కాని, సాయి ఎప్పటికీ కదలడు. ప్రచారం చేత కించిత్తైనా చలనం రాదు. ఆచరణ చాలా అవసరము. సాయి సంస్థలలో ప్రతి ఒక్కరూ ఆచరణ ద్వారా సరియైన ప్రచారం చేయండి. మీరు చేస్తూ ఉంటే ఇంకొకరు చూసి దానిని అనుసరించాలి. మీరు చేసి చూపించి ఇతరులకు ఆదర్శాన్ని అందించండి. ఇదే నేను కోరేది. నాకు ఏ విధమైన ఆశ కూడా లేదు. ఐతే దేశాన్ని బాగు పరచాలి. దేశానికి అనుకూలం చేయాలి. బీదలు ఎక్కడైనా ఉంటున్నారు. మీరు ఎక్కడ సేవ చేసినా అది సాయి సేవగా భావించాలి. ఈ విధమైన త్యాగభావాన్ని మీరు అధికంగా పెంచుకోవాలి. ఇక్కడకు వచ్చి నప్పుడు మాత్రమే త్యాగాన్ని ప్రదర్శించడం, బయటకు పోతూనే కాంక్షలు పెంచుకోవడం సరియైనది కాదు. ఎక్కడికి వెళ్ళినా సేవాభావాన్ని కలిగియుండాలి.
ఈ సేవాభావము చేతనే మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి.
(స.సా.ఏ.94 పు.97/99)
పరోపకారాయ ఫలంత వృక్ష: పరోపకారాయ వహంతి సద్యః పరోపకారాయ దుహంతి గావః పరోపకారార్థమిదం శరీరం.ఈ ప్రపంచమందు ఎట్టి ఫలాపేక్ష లేకుండా వృక్షములు జీవులకు మధురమైన ఫలముల నందిస్తున్నవి. నదులు ఎట్టి ఫలాపేక్ష లేకుండా జలమునందించి సర్వ జీవులను పోషిస్తున్నవి. గోవులు ఎట్టి ప్రతిఫలాపేక్ష లేకుండా మానవులకు మధురమైన క్షీరము నందించుచున్నవి. ఈ వృక్షములు, నదులు, గోవులు లేకుండిన జగత్తే లేదు. వృక్షములు, నదులు, గోవులు ఫలాపేక్ష రహితంగా ఈ జగత్తును పోషించుచున్నవి గాని, మానవుడు ఫలాపేక్ష లేకుండా తోటి మానవునకు ఉపకారం చేయటం లేదు. వృక్షములకు, నదులకు, గోవులకు ఉన్న త్యాగం ఈ నాటి మానవునికి లేకపోతున్నది. మానవుడు నిరంతరము స్వార్థ స్వప్రయోజనములందె కాలమును గడుపుతున్నాడుగాని, పరోపకార సంబంధమైన సత్కార్యములందు క్షణమైనా త్యాగము చేయుటం లేదు.
(సా శ్రు పు.26)
శ్రీరాముని నిరంతరసాన్నిధ్యము నాశించిన సీత, తన సర్వాభరణములను, తన సర్వస్వమును పరిత్యజించి, రాముని వెంట అరణ్యమునకు వచ్చినది. ఒక్క కామమును త్యాగము చేయుటచేతనే, శ్రీరాముని నిత్యసన్నిధి చేరుటకు ఆమెకవకాశమేరడినది. కాని, ఈ అరణ్యములో, పంచవటి దగ్గర, బంగారు జింకపైన ఆశ తలచూపగానే, సీతకు రాముడు దూరమైపోయాడు. ప్రపంచ వాసనలు పెరుగుతూపోవు కొలది, పరమాత్మ సన్నిధి దూరమవుతూ వస్తుంది. ప్రపంచవిషయ వాసనలు తగ్గించుకొలదీ పరమాత్మ అతిసమీపమవుతాడు.
(ఆ. రా. పు 34)
ఈనాడు మానవుడు దివ్యత్వాన్ని పొందే నిమిత్తమై ఏవో కొన్ని రకముల సాధనలు ప్రారంభిస్తున్నాడు. చెట్టు కొట్టదలచిన వాడు తల్లివేరును కొట్టాలిగాని కొమ్మలు రెమ్మలు కొట్టినంత మాత్రమున చెట్టు చావదు. పుట్ట పైన మర్దించిన పాము మరణ మొందునా? తనువును తానిందించిన విషయ భోగము లణుగునా? ఆకలిదప్పులు మానినంత ఆత్మజ్ఞాని తానవునా? తానెవరో తెలియకున్న తత్వజ్ఞానమెట్లు కలుగును? కేవలము కొన్ని భజనలు దాన ధర్మములు చేసినంత మాత్రమున దైవత్వము అంత సులభముగా లభ్యము కాదు. అట్లని ఈ కర్మలను మానకూడదు.
చినుకులు పడినంత చెరువులు నిండునా?
ఉమ్మి మింగ దాహముడుగు నొక్కో?
ఊపిరి బిగబట్ట ఉదరంబు పెరుగునా?
బొచ్చు కాల్చినంత బొగ్గులగునా?
బొగ్గులు కావాలంటే కట్టెలనే కాల్చాలి. చెరువులు నిండాలంటే కుంభవర్షమే కురవాలి. దాహము తీరాలంటే చల్లని నీరే తాగాలి. అదే విధముగ దైవత్వము లభించాలంటే త్యాగము చేయాలి. దీనినే ఆధారము చేసుకొని వేదము "త్యాగేనైకే అమృతత్వమానశు: ఆన్నది. త్యాగమనగా ఏమి? ఇల్లు వాకిలి వదలడమా త్యాగము? ఆలు బిడ్డలను త్యజించడమా త్యాగము? కాదు. మనమున్న చోటనే ఉండి, చేయవలసిన కర్తవ్యములను సర్వమూ దైవార్పితమనే భావములతో ఆచరించడమే విజమైన త్యాగము. దీనికి హృదయ పవిత్రత అవసరము, హృదయ పవిత్రత కలిగినప్పుడే సర్వము మనకు లభ్యమవుతుంది.
(త్వ. శ.మ పు.269)
త్యాగముతోనే అమృతత్వము
ఒక మిద్దెపైకి ఎక్కాలంటే నిచ్చెన వేస్తాము. ఈ నిచ్చెన పైన మిద్దె గోడకు ఆనుకొని ఉండాలి, క్రింద భూమిని ఆధారంగా చేసుకోవాలి. క్రిందనున్న ఆధారమే విశ్వాసము, పైన ఆనుకొని ఉన్న గోడయే ప్రేమ. కనుక ప్రేమ, విశ్వాసము - ఈ రెండూ ఉన్నప్పుడు మనము ఎంతటి ఉన్నతస్థాయికైనా వెళ్ళవచ్చును. ఈ రెండింటినీ సంపాదించుకుంటే ఏ జపధ్యానములూ చేయనక్కరలేదు. ప్రేమ, విశ్వాసములను పెంచుకున్నప్పుడే మనలో ఆనందము ఆవిర్భవిస్తుంది. ఆనందములో నీది, నాది అనే భేదము ఉండదు. అప్పుడు సర్వమును త్యాగం చేస్తావు. "త్యాగేనైకే అమృతత్వ మానశుః” కానీ మానవుడు త్యాగం చేయలేకపోతున్నాడు. కారణమేమిటి? అహంకార మమకారములు మానవుని కట్టివేశాయి. ఈ రెండే మానవుని నరకమునకు తీసుకొనిపోతున్నాయి. ప్రతి ప్రాణమును యమధర్మరాజు పాశము వేసి లాక్కొని పోతున్నాడంటారు. ఇన్ని ప్రాణములు తీసుకొనిపోవడానికి యమధర్మరాజు రోప్ ఫ్యాక్టరీ ఎక్కడ పెట్టాడు?! అహంకార మమకారములే మానవుని గొంతుకు పాశముగా తయారవుతున్నాయి.-----శ్రీసత్యసాయి (సనాతన సారథి, సెప్టెంబరు 2021 -4గవ కవరు పేజి)