17 వశిష్ఠుడు / వశిష్ట మహర్షి
విద్యార్థులారా! మానవత్వమంటే ఏమిటో అర్థము చేసుకోటానికి ప్రయత్నం చేయండి. మానవత్వములోనున్నదివ్యశక్తిని ఎవరికీ గుర్తించుటకు వీలుకాదు.ఈ జగత్తులో ఎన్ని శక్తులుంటున్నాయో ఆ శక్తులన్నీ మానవునియందే ఇమిడి ఉంటున్నాయి. నీవు ఒక్క మానవాకారము కాదు, విశ్వవిరాట స్వరూపుడవు. ఉపనిషత్తులలో మానవుడనగా విలువైన వాడని ఒక అర్థం. డైమండుకు విలువ ఎవరిస్తున్నారు? మానవుడే. భూమికి విలువ ఎవరిస్తున్నారు? మానవుడే. బంగారుకి విలువ ఎవరిస్తున్నారు? మానవుడే. కాబట్టి Men are more valuable than all the wealth of the world. మనిషికంటె విలువైనది మరొకటి లేదు. అలాంటి మానవత్వాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. ఆనాటి పవిత్రమైన ఋషులందరు భగవత చింతనలో మానవత్వాన్ని సార్థకము గావించుకున్నారు. ఒకానొక సమయంలో దశరథా! నేను నీధనము చూచి రాలేదు. నీ శక్తి సామర్థ్యములు గొప్పవని భావించి రాలేదు. నేను ఎందుకోసం వచ్చానో తెలుసునా? ఏ ఇంటిలో శ్రీమన్నారాయణుడు పుట్టబోతున్నాడు. అతనితో కొంతకాలం గడపాలని వచ్చాను". అంత ప్రేమతో ఉండేవాడు వశిష్టుడు.
(ద.స.98పు.41/42)
వశిష్ట మహర్షి మహనీయుడు. సర్వ విద్యలు అతడి హస్తగతము. దైవ ఋషి, అంత దైవ ఋషియైన వశిష్టుడు కూడా ఒక్కొక్క సమయంలో దైవత్వాన్ని గుర్తించుకో లేకపోయాడు. అతడికి శ్రీమన్నారాయణుడని తెలుసు. ఒకానొక సమయంలో దశరథునకు చెబుతున్నాడు వశిష్టుడు: ’దశరథా! ధనధాన్యాదులు నేనేమీ నీనుండి కోరటం లేదు. నీ దగ్గర పురోహితునిగా వచ్చి ఉండటానికి నాకేమీ అవసరము లేదు. కాని నీ గృహములోసాక్షాత్ నారాయణ మూర్తి ఉద్భవిస్తున్నాడు. కనుక అతని చర్యలు చూడాలి, అతని సేవలు చెయ్యాలి అనే సదుద్దేశ్యముతోనే నేను నీ దగ్గర పురోహితునిగా పనిచేస్తున్నాను. నీ ధన కనక వస్తు వాహనాదులు నాకు అక్కరలేదు. నేను సంకల్పించుకుంటే సర్వము ఏర్పడుతుంది. దైవము కోసం నేను నీ ఇల్లు చేరాను" అన్నాడు. ఇంత తెలుసుకున్న వశిష్ఠుల వారు కూడ రామునకు ప్రబోధలు చేస్తూవచ్చాడు. అదియే వశిష్ట గీత. యోగవాశిష్టము అన్నారు. ఇంత తెలుసుకున్న వశిష్టునికి ఎందుకీ మాయ రావటం?సామాన్యమైన మానవత్వముగా భావించుకుంటూ తరువాత దివ్యత్వమును కూడా నిరూపించాడు. దీనికి కారణము ఉపాధియే. చిన్న ఉదాహరణము-లోకములో అనేక ముహూర్తములు పెడుతూ ఉంటారు పండితులు. శ్రీమన్నారాయణుడైన రాముని పట్టాభిషేకమునకు వశిష్టులవారే ముహూర్తము పెట్టారు. తెల్లవారి ఏడుగంటలకు పట్టాభిషేకము అని. ఆ ముహూర్తము అరణ్యవాసమునకు ముహూర్తముగా మారిపోయింది. ఏమిటి ఈ ముహూర్తము యొక్క పవిత్రం? ఎవరు పెట్టినది? ఎవరి కోసం? ఎవరో పంచాంగము బ్రహ్మణుడు పెట్టినది కాదు. సాక్షాత్ వశిష్టులవారు పెట్టినది. బ్రహ్మర్షి కానీ ఈ విధంగా మార్పు వచ్చింది. అనగా దైవసంకల్పమునకు ఏ ముహూర్తము అడ్డురాదు. వారు పెట్టే ముహూర్తము ఒకటి, ఇరిగేది మరొకటి. ఇవన్నీ ఏమాత్రము పనికిరావనే సత్యాన్ని ప్రపంచమునకు ప్రబోధించే నిమిత్తమై ఈ రకంగా చేస్తూ వచ్చాడు.
(భ.మ. పు.41/42)
(చూ॥ బ్రహ్మర్షి, రాముని ఆశయము)