పుడమిని కన్నతల్లి పూజనీయులు కదా!
వారి మించువారు వసుధ లేరు
కన్నతల్లి సేవకన్న మించినది లేదు
జన్మభూమి కన్న స్వర్గమేది?
(సా.పు. 362 )
ప్రేమస్వరూపులారా! ఈ ప్రపంచములో అనేక విధములైన సంబంధ బాంధవ్యములున్నాయి. కానీ, తల్లితో గల బాంధవ్యమును మించినది మరొకటి లేదు. దీనిని పురస్కరించుకొనియే స్వదేశమును మాతృదేశం అన్నారు. స్వభాషను మాతృభాష అన్నారు. తల్లికి ఉన్న ప్రాముఖ్యత మరెవరికీ లేదు. తల్లిదండ్రుల పేర్లలో తల్లి పేరే మొదట వస్తుంది. అదేవిధంగా భార్యాభర్తల పేర్లలో కూడా భార్య పేరు వస్తుంది. సీతారాములు అంటారేగాని రామసీతలు అని ఎవరైనా అంటారా? అదే విధంగా రాధాకృష్ణులు అంటారేగాని, కృష్ణరాధ అని అనరు. ఇది లౌకిక జీవితానికి మాత్రమే పరిమితం కాదు. ఆధ్యాత్మిక మార్గము నందు కూడా స్త్రీలకు, తల్లులకు ప్రధమస్థానం అందించబడింది. దయ, సహనము, శాంతి, సత్యము, సానుభూతి ఇత్యాది సద్గుణములను మొట్టమొదట నేర్పించేది తల్లియే. పవిత్ర హృదయులైన తల్లుల అడుగు జాడల ననుసరించియే కుమారులు గుణవంతులుగను, కీర్తివంతులుగను, మేధావంతులుగను అభివృద్ధి గాంచుతారు. ఈ లోకంలో దుర్మారుడైన కుమారుడు ఉన్నాడు గాని, దుర్మార్గురాలైన తల్లి లేదు. ప్రత్యక్షంగా, భౌతికంగా మిమ్మల్ని పోషించి అభివృద్ధికి తెచ్చేది మీ తల్లియేగాని దైవం కాదు. ప్రత్యక్షంగా కంటికి కనిపించే వారు మీ తల్లిదండ్రులు, మిమ్మల్ని కనిపెంచి పెద్దచేసినవారు మీ తల్లి దండ్రులు ఆలాంటి వారిని విస్మరించి, కంటికి కనిపించని విష్ణువును, శివుణ్ణి, రాముణ్ణి, కృష్ణుణ్ణి ఆరాధిస్తే ప్రయోజనం లేదు. మీ పుడ్డు, మీ హెడ్డు, మీ బ్లడ్డు, మీ దుడ్డు అంతా తల్లిదండ్రుల యొక్క వరప్రసాదమే. వీటిని ఏ దేవుడూ మీకు ప్రత్యక్షంగా అందించటం లేదు కదా. కనుక, మొట్టమొదట మీరు తల్లిదండ్రులను దైవంగా విశ్వసించాలి. ప్రత్యక్షంగా కనిపించే తల్లిదండ్రులను ప్రేమించి గౌరవించినప్పుడే పరోక్షమైన దైవత్వం మీకు సాక్షాత్కరిస్తుంది. తల్లి తండ్రిని చూపుతుంది. తండ్రి "నాయనా!ఇతడు నీ గురువు ఇతను చెప్పినట్లు విను" అని గురువును చూపుతాడు. గురువు దైవాన్ని చూపుతాడు. కనుకనే తల్లి,తండ్రి, గురువు, దైవము - ఈ నల్గురిలో తల్లికి ప్రథమ స్థానం అందించబడినది.
(స.సా. జూ 99 పు. 141/142)
తల్లులే దేశమునకు వెన్నెముక వంటివారు, హృదయం వంటివారు, శ్వాసవంటివారు. ఈ ప్రపంచ నాటకంలో తల్లుల పాత్రయే ప్రధానమైనది, పవిత్రమైనది. కనుక, తల్లులే జాతిని, నీతిని నిర్మంచుటకు కృషి చేయవలెను. ప్రతి మానవునికి తల్లి ఒడియే బడి, ఒడియే ప్రథమ గుడి. ప్రతి స్రీ ఉత్తమ మాతృమూర్తిగా తయారు కావడం అత్యవసరం. మంచి భార్య, భర్తకు మాత్రమే ఆదర్శం. మంచి హృదయం గల మాతృమూర్తి ప్రపంచానికే ఆదర్శం .
(స.సా.జూ .99 పు. 148)
ద్రౌపది ఎట్టి పరిస్థితులలోను కృష్ణుని మాటలను ఉల్లంఘించేటటువంటిది కాదు. అలాంటి పతి వ్రతామ తల్లులు, ఈ పవిత్ర భారతావనిలో ఉండటంచేతనే భారతదేశము ఈనాటికీ ఎంతో క్షేమాన్ని అనుభవిస్తున్నది. కనుక క్షమాభావము ప్రతి మానవునికి అత్యవసరం అప్పుడే క్షమారూపంలో సాక్షాత్కరిస్తాడు దైవము. ఈ గణపతి పండుగ కూడనూ క్షమాతత్త్వాన్ని ప్రకటింపచేసి, దివ్యతత్వాన్ని ఆచరింపజేసి, ఆనందాన్ని అనుభవింపజేసే టటువంటిది.
(శ్రీ. అ . 2000 పు.11)
ఆనాటి పవిత్ర హృదయులైన తల్లులు ఏది చెప్పినప్పటికీ అది తప్పకుండా జరిగేది. అలాంటి తల్లులు తమ కుమారులను ఆశీర్వదించేటప్పుడు దైవం కూడా, "తథాస్తు తథాస్తు" అనేవాడు. కేవలం తల్లి యొక్క ఆశీర్వాదం మాత్రమే చాలదు, దైవానుగ్రహం కూడా అత్యవసరం. నెగెటివ్, పాజిటివ్ చేరిక వల్ల కరంటు ఏర్పడినట్లుగా తల్లి ఆశీర్వాదం, దైవానుగ్రహం రెండూ చేరినప్పుడే విజయం ప్రాప్తిస్తుంది. కనుక ప్రతి వ్యక్తి తన తల్లి హృదయాన్ని సంతృప్తి పరచడానికి ప్రయత్నించాలి. దానితోపాటు దైవానుగ్రహం కోసం పాటుపడాలి. దైవానుగ్రహం లేకపోతే తల్లి ఎంతగా ఆశీర్వదించినప్పటికీ ప్రయోజనం ఉండదు. మహాభారత యుద్ధానంతరం శ్రీకృష్ణుడు గాంధారీ ధృతరాష్ట్రులను చూడడానికి వెళ్ళాడు. ధృతరాష్ట్రుడు చాలా బాధపడ్డాడు. గాంధారి పట్టలేనంత దుఃఖంలో, కోపంలో కృష్ణా! కౌరవులు, పాండవులు అన్నదమ్ముల బిడ్డలేకదా! మరి నీకు కౌరవులపై అంత ద్వేషం ఎందుకు? ఐదుమంది పాండవులనూ సురక్షితంగా కాపాడావు. కాని నా సూరు మంది కుమారులలో ఒక్కడైనా మిగలకుండా చేశావు, ఎంతటి పక్షపాతం నీకు!" అన్నది. అప్పుడు కృష్ణుడు నవ్వుతూ, "గాంధారీ! నీకు సూరురు కుమారులు కల్గినప్పటికీ ఏనాడైనా ఒక్కడినైనా నీ కంటితో చూశావా? తల్లి దృష్టికే నోచుకోలేనివారు దైవ దృష్టికి ఏరీతిగా నోచుకోగలరు?" అన్నాడు. కనుక కుమారుడి పైన తల్లి దృష్టి పరిపూర్ణంగా ఉండాలి. నేటి కాలంలో దుర్మార్గుడైన కుమారుడు ఉన్నాడేమో గాని దుర్మార్గురాలైనా తల్లిలేదు. మాతృదేవిని ఎంతగా ఆనందపర్చితే మాతృదేశం కూడా అంతగా ఆనందాన్ని అనుభవిస్తుంది. ప్రతి వ్యక్తికి జనవి, జన్మభూమి రెండూ చాలా ప్రధానమైనవి.
భారతీయుల పవిత్రమైన సంస్కృతిని మనము చక్కగా అర్థం చేసుకోవాలి. భవిష్యత్తులో మాతృస్వరూపులుగా తయారయ్యే విద్యార్థినులు ఉంటున్నారు. కనుక, మీరు ఈ విషయాలను శ్రద్ధగా విని, మీ పిల్లలను సరియైన పద్ధతిలో పోషించి, అభివృద్ధి పరచి, ఆదర్శపుత్రులగా తయారుచేయాలి.
పూర్వము మదాలస అనే స్త్రీ తనకు పుట్టిన పిల్లవానికి నిరంతరం భగవచ్చింతన బోధించేది. తన పిల్లవానిని ఉయ్యాలలో ఊపుతూ. "ఓంకారమనే ఒక తొట్టిలోన, తత్వమసి అనే పరుపు పరచి, ఎఱుక అనే బాలుని వీమరక ఉంచి, ఏడుజగముల వారు ఏకమై ఊయల ఉపగా, లాలి..... "ఓ కుమారుడా! అప్పుడే నీ ప్రజ్ఞానం వికసిస్తుంది. నిరంతరం నీవు దివ్యమైన భావాన్ని కలిగియుండుము. ఈ లోకముక్తికై నీవే మాత్రము వెరువవద్దు. నీవు దివ్యత్వాన్ని పొందుము." అని ఆశీర్వదిస్తూ ఆమె జోలపాట పాడేది. కాని ఈ నాటి వారు పిల్లవానిని ఊయలలో పరుండబెట్టి "నీవు గొప్ప విద్యావంతుడవు కావాలి. నీవు విదేశాలకు వెళ్ళి డబ్బు సంపాదించాలి." అని దీవిస్తూ జోలపాట పాడుతుంటారు. ఇటువంటి భావాలతో పిల్లలను పోషిస్తున్నారు. పిల్లవాడు పుట్టిన వెంటనే పెండ్లి గురించి ఆలోచిస్తారు. "నీకు లక్షాధికారి బిడ్డ నిచ్చి పెళ్ళి చేస్తాము. అప్పుడు మంచి వరకట్నం కానుకలు వస్తాయి. వాటి ద్వారా మనం మిద్దె కట్టుకోవచ్చు." ఇటువంటి ఆశలను ఈనాటి తల్లులు తమ పిల్లలకు చిన్నతనం నుండియే బోధలు చేస్తున్నారు.
(శ్రీభ.ఉ.పు.132/133)
పరమేశ్వరుడిట్లు తరుణియు పురుషుడై
ధర క్రీడించుచునుండగా నిజముగా
చూడ తరుణి జన్మమె ఘనముగా
గర్భధారణ భరియింప వలెనుగా
నవమాసంబులు మోసి కనిపెంచి
ఘన బుద్ధులను నేర్పి తనయుల
నొసగెడి తల్లి తక్కువ యోనా?
(భారతీయ స్రీ పు62)