గీత యొక్క విలువను తెలుసుకొనవలెనన్న మొదట గీతపై పూజ్యభావము కలుగవలెను. గీతకు బహిరంగ పరీక్షణము, బాహ్యనిరీక్షణము అత్యవసరము. తలపై నుంచుకొవలసినది గ్రంధముకాదు. అందులోని భావములను, పూజగ్రంధమునకు కాదు, అందలి విషయమునకు పీఠములపై పెట్టుటకాదు, హృదయపీఠమున ప్రతిష్టింపవలెను. అట్లు చేసిననే గీత యొక్క సత్యము నిత్యము, నిర్మలమై నిలుచును.
ఆకొన్నవాని ఆకలి తీరునా
పంచభక్ష్యముల పాకమువిన్న?
నిరు పేదవాని పేదరికంబు పోవునా
విత్త ప్రభావంబు విన్నయంత?
రోగపీడుతు వా ని రోగము తిరునా
ఔషధ మహిమంబు అంత విన్న?
భవరోగ నివారణ కావాలంటే, భగవంతుడు మన మనస్సులో నిలిచిపోవాలి. మన రక్తములో కలిసిపోవాలి. సర్వత్రా ఉన్న ఈశ్వరతత్వాన్ని హృదయస్థానమున అభివృద్ధి పరచుకొని అంతర్ దృష్టి ద్వారా దర్శించుకోవడానికి ప్రయత్నించాలి.
హృదయము లేని మాటల కంటే, మాటలు లేని హృదయములుగా మనము తయారు కావాలి. మానవుడు ఈనాడు అభివృద్ధి పరచుకోవలసింది మాటలు లేని హృదయము. ప్రేమ స్వరూపులారా! మనము వేద, ఇతిహాస, పురాణములను పఠించవచ్చు. భగవద్గీతను పారాయణము చేయవచ్చును. ఇవి పవిత్రకర్మలే! కాని, మన నిత్యజీవితములో అనుభవించవలసిన అనుభూతులు, చేయవలసిన పనులు. కర్తవ్యములు సక్రమమైనటు వంటివిగా ఉండాలి. మన ప్రవర్తన సక్రమముగా లేకుండా, ఎన్ని భగవద్గీతలు చదివినా, ఎన్ని ఉపనిషత్తులు పఠించినా మనకు వచ్చిన ఫలితమే మాత్రము ఉండదు.
కాషాయ వస్త్రము కట్టిన మాత్రాన
కరతలామలకంబు కాదు భక్తి
నోటిలో మంత్రంబునుచ్చరించిన లోన
చేసిన పాపంబు చెదిరిపోదు.
గీతల చేబట్టి కేకలు వేసిన
పుణ్యంబు మన ఇంట ప్రోగుపడదు
చెప్పు మాటలకు చేసెడి చేతలకున్
సామ్యముండెడి వాడే సాధువగున్
మనలో ఉట్టినటువంటి, ద్వేష అసూయాదులనే కంపునుండి, మననుండి ఎప్పుడు విడదీస్తామో, అదే నిజమైన భక్తి ప్రవీణత లక్షణము. కావున గీతా ప్రచారకులు గాని, గీతాపారాయణులు గాని బాహ్యడంబరములకు పోక, విషయమునకు హృదయ స్థానిమిచ్చి, ఆచరణ యందనుభవించుకొని, ఆనందము పొందుట ధర్మము.
(శ్రీ.భ.ఉ.పు.37/38)
(చూ||ఓర్పు, భగవద్గీత)