మొసలికి నీటిలో బలముండునట్లు ధర్మమునకు ఆచరణయందే బలము కానీ చెప్పుటయందు వాటికి తగిన బలము వుండదు. సత్యమునకు చెప్పుటయందే బలము కానీ ఆచరించుటలో అంత బలము వుండదు. బలమనగా ఇక్కడ రెండు విధములైన బలములు కలవు: పశుబలము, ధర్మబలము. మానవునకు ధర్మబలము బలము కాని పశుబలము బలమనిపించుకొనదు. భీముడున్నాడు. అతని బలము కేవలము దేహబలము మాత్రమే. అందువలన అతని బలము పశుబలమనే భావించవలెను. ప్రక్కన ధర్మజుడుండుటచే అతని బలముధర్మబలమైనది. ధర్మజుడు ప్రక్కన ఉన్నంతవరకూ భీముని బలము ధర్మబలమేకాని పశుబలము కాదు. ధర్మ బలమువలననే పాండవులు రక్షింపబడిరి. కాని కేవలము పశుబలమే ఉండియుండిన పాండవులు ప్రారంభములోనే పరాభవమొంది యుండెడివారు. ధర్మజుడులేని పాండవుల గతి యెన్ని బలములుండీ యేమాయెడిదో యోచింపుడు! కౌరవులకు సర్వబలము లుండినమా నశించుటకు కారణమేమి? ధర్మబలము లేదు. కనుకనే వారి సర్వబలములు పశుబలములై పోయెను. యేనాడు ధర్మబలమను ధర్మజుడూ భీముడూ అడవులపాలై పోయిరో ఆనాడే కౌరవ రాజ్యములో అధర్మము ప్రవేశించెను. కనుక ఇప్పుడు అడవులందున్న ధర్మబలాలను గ్రామాదులకు జేర్చవలెను. అప్పుడే లోకము సుభిక్షమై శాంతి సంపదలభివృద్ధి చెందగలవు. అధర్మ పరిపాలన బారి నుండి తప్పించుకొని ధర్మపరిపాలనలో మనము ప్రవేశము కావలెను. పంట పైరును రక్షించుటకే కలుపులను తీసివేయు ప్రయత్నము అవసరము కాని, పనికిరాని గడ్డి పైరులు మొలిపించుటకు ఏ ప్రయత్నమూ అక్కర లేదు. అటులనే ఇప్పుడు పంట పైరైన సహజ ధర్మమును ఆచరణలోనికి తెప్పించుటకే, సర్వ ప్రయత్నములు కావలెను.
(గీ.పు. 55/56)