సాయింకాలము భజన అయిన తరువాత 10 నిమిషాలు ధ్యానానికి కూర్చుంటావు. అంత వరకు బాగానే ఉంది. కాని 10 నిమిషాల తరువాత నీవు లేచి తిరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరిని స్వచ్ఛమైన కాంతిలో చూసినప్పుడు వాడు దైవత్వంతో ఉన్నట్లు గమనించేవా? అలా కానట్లయితే ఆధ్యానం కాలం వృధా గావించడమే. నీవు ఎక్కువగా ప్రేమిస్తావా? తక్కువగా మాట్లాడతావా? ఇతరులను శ్రద్ధతో సేవిస్తావా? ఇవి ధ్యానంలో అభివృద్ధికి చిహ్నాలు. నీ పురోగతి నీ ప్రవర్తనలో, నడతలో ప్రస్ఫుటించాలి. ధ్యానం నీవు ఇతరుల గురించి, ఇతర వస్తువుల గురించి ప్రవర్తించే తీరులో ప్రతిబింబించాలి. లేకపోతే అది హాస్యాస్పదమే. ఒక బండరాయి అయినా ఎండా వానలకు, చలికి వేడికి ముక్కలు, ముక్కలై బురదగా మారి చెట్టుకు ఆహారంగా మారిపోయింది. ఎంతటి కఠిన హృదయమైనా మెత్తబడ వచ్చు. దానిలో దివ్యత్వము మొలకెత్తవచ్చు.
(ఆ. ప..పు.19)
మీరు ఏ సాధనా చేయనక్కర లేదు. సమయం చిక్కితే జపం, ధ్యానం అన్నీచేయండి. ఆధునిక యుగంలో జపం, ధ్యానం కుదరడం కష్టమే. మెడిటేషన్ చేయాలని కూర్చుంటే mind మాత్రం Market లో తిరుగుతూ ఉంటుంది. కొందరు చేతిలో జపమాల తిప్పుతూ ఉంటారు. కానివారి "మైండ్" మంగలింటికి, చాకలింటికి, ప్రయాలు మౌవుతుంది.ఈవిధంగాకాలాన్నివ్యర్థం చేయకండి. జపం, ధ్యానం చేయడం మీకు కుదరకపోతే సేవచేయండి. ధాన్యం మీకు అక్కరలేదు..
నోరు మూయాలి. హృదయాన్ని తెరవాలి. ఇదే విజమైన ధ్యానం. అనేక మంది హృదయాన్ని మూసి పెడుతున్నారు. - నోరు తెరుస్తున్నారు. ఇది ధ్యానం కాదు.
(దే.యు.పు.13)
"శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాద్థ్యానం విశిష్యతే,
ధ్యానాత్కర్మఫలత్యాగస్త్యాగాచ్ఛా న్తి ర న న్త ర మ్..
దైవమును పొందే నిమిత్తమై దైవమును చెందే నిమిత్తమై నిత్యజీవితములో సాధకులు చేసే తర్పీదు అభ్యాసమని చెప్పబడుతుంది. ఇట్టి అభ్యాసమునకంటె దైవమును హృదయములో నిలుపుకొని తాదాత్మ్యభావమును పొంది ఏకత్వములో దివ్యత్వమును పొందే దివ్యస్థితినే ధ్యానమన్నారు. "ద్వై చిన్తాయాం " అనే ధాతువు నుండి పుట్టినదే ధ్యానము అనే పదము. భగవంతుని చింతనే ధ్యానమని చెప్పబడుతున్నది. అప్పుడప్పుడు చింతించి నంత మాత్రమున అది ధ్యానము కానేరదు. సతతం చింతన చేయటం, సర్వకాలములయందును, సర్వావస్థలు యందును, సర్వప్రదేశముల యందును, దైవచింతన చేసే స్థితిని ధ్యానము అని చెప్పవచ్చును. అభ్యాసమనేది కాలముతో కర్మముతో కారణముతో కూడి వుంటుంది. కాలకర్మకారణములకు అతీతమైన
స్థితియే ధ్యానమని చెప్పబడుతుంది. అభ్యాసము కంటే ఉత్తమమైనది ధ్యానము. ఈ ధ్యానముకంటే జ్ఞానము మరింత ఉత్తమమైనది. ఇది విచారణ శక్తితో కూడినది. ఇది విషయ పరిశీలనలతో కూడినది.
(శ్రీ గీపు.26)
ధ్యానజపమనగా మనోబుద్ధుల నిర్మలమొనర్చుటే.
ధ్యాన సంపద కలుగునంతవరకు, నిర్ణీత ఆసీన క్రమములను అవలంభింపవలెను. అంతవరకు ఆ క్రమశిక్షణ పాటించవలెను. ధ్యానసంపద కల్గిన తరువాత అనగా, మనో బుద్ధులు వశమయిన తరువాత తాను పరుండిన పడకపై సహితము కూర్చున్న కుర్చీ మీద, మరే ఇతర బండమీద. బండిమీద ఎచ్చటైనను సరే, ఎట్టి పరిస్థితిలోనైనను సరే, ఎట్టి సమయములోనైనను సరే ధ్యానము సలుప సాధ్యమగును.
భక్తుని మనోవాంఛ సఫలము చేయుటకు విశ్వమునకు ఆధారభూతుడైన, హరి ఏ రీతిగానైనా ఎక్కడైనా వచ్చును. అయితే తనను ఏకాగ్రతచిత్తులై ప్రార్థించవలెను. అట్టి ఏకాగ్రత పుట్టుకస్థానమే సత్త్వగుణము. అట్టి సత్వగుణము యొక్క జన్మభూమే ధ్యానము.
ధ్యానము చేస్తూ చేస్తూ ఒక రూపము వచ్చును. ఆ రూపమును చూస్తూ చూస్తూ కడకు ఆ రూపము కూడా మరుగయి, నీకు నీవు మరతువు. దానివే సమాధి అందురు. మానవుడు, అట్టి సమయమున, ఒకే భావము కలియున్నప్పుడు సవికల్ప సమాధి అనియూ, ఏ భావము లేకుండా మనసు ఖాళీ గా నుండిన, రాజయోగ శాస్త్రమందు పతంజలి తెలిపిన భావనాశనము అనబడును.
(ధ్యా.వా.పు.10,13,60,85/86)
ధ్యాన సాధన సలుప వలసిన వారు నిర్ణీత క్రమముల ననుసరించే తీరవలెను. అందులో ఏ మార్పును చెందకూడదు. అయితే, రజో తమోగుణ సాధనలు మాత్రము ధ్యాన మనిపించుకోవు. అట్టి వాటిని అణగదొక్కి కేవల సాత్విక సాధన చేసిన అది ధ్యానమనిపించుకొనును. అదే ఉత్తమ సాధన. ఒక విషయమును మాటలతో వర్ణించుట కష్టమే కాక విసుగుకూడా జనించును. దానిని కార్యముచేసి చూపుట అతి సులభము, ఆనందము. ధ్యానముచేసి తెలిపిన నీమము ననుసరించి ధ్యానమార్గమును తెలిసికొనుట మంచిది. నే వ్రాయుటవల్ల, మీరు పఠించుట వల్ల అంత సులభముగ మీకు తెలియదు. ధ్యానమువల్ల మానవుని అంతరమున ఆత్మను కనుగొనగల దివ్యానుభవమును పొందుచున్నాడు. ధ్యానమువల్ల సాధకుడు భ్రాంతి కలిగించు ఆవరణములనుండి పొరలు పొరలుగా ఉపసంహారము పొందుచున్నాడు. ప్రపంచ విషయానుభవములనుండి ఇంద్రియ వ్యవహారములను వెనుకకు మరల్చుచున్నాడు.
ఇట్టి పవిత్ర స్థానమును పొందగోరుటే ధ్యాసమనబడును. దీనికి ప్రధానముగా మానవుడు చక్కని నీతినియములు కలిగి యుండవలెను. ప్రపంచ విషయములు, అందుగల తీవ్ర ఆకర్షణలయెడ విరాగము గలిగియుండవలెను. ఎట్టి సమయమునందైనను ఉత్సాహ, ఆనందములతో మెలగవలెను. ఏ కార్యమును చేసినను జీవిత మార్గమునకు కాక ఆత్మానందమునకని భావించవలెను. తన శరీరమును చక్కని ఆసనమున యుంచగలిగి, అంగములు సళ్ళు పరచి, శరీరము యొక్క బరువు, ఒత్తిడియు తన మనోదృష్టిని లాగకుండునట్లు నిలుపుటకు అభ్యాసము చేయవలెను. ఇదియే సాత్విక ధ్యాన సాధ అనబడును. దీనికే క్రమము ముఖ్యావసరము.
(ధ్యా వా.పు.14/15)
సాధకులు, సన్యాసులు ధ్యాన యోగులు ఒక నిచ్చెన మూలముననే ఆయా స్థానములు పొందగల్గుదురు. ఆ నిచ్చెన మెట్లు సవితర్క నిర్వతర్క, సవిచార నిర్విచార సమ్మత మొదలగునవి. ప్రపంచ స్థానమనునది నిజమైన స్థానము కాదు. ప్రపంచమే మిథ్య మైన, ఇంక జ్ఞానము మాత్రము సత్యజ్ఞాన మెట్లగును? నిత్యమైన అంతర్ముఖ ఆత్మజ్ఞానము, సత్యజ్ఞానము. దానిని పాందు, పోందించు మార్గమే ధ్యానమార్గము.
(ధ్యా .వాపు 34)
ధ్యానము అంటే ఏమిటి? బ్రాహ్మభావము చేత స్థిరమైన తత్త్వాన్ని పొందుట. ఇలాంటి వేదాంత వాక్యములు ఎన్ని విధములైన అంతరార్థములనో ప్రబోధిస్తూ ఉంటాయి. దీనినే వేదాంతమునందు మరొక రీతిగా వాసః అన్నారు. వాసః అనగా నీ నివాసమెక్కడ?
ఈనాడు జగత్సంబంధమైన వాసమని బోధిస్తున్నాము. సర్వజీవుల యొక్క వాసము భగవంతుడే నేను భగవంతుని యందు వాసము చేస్తున్నావు. నీవు ఆత్మ స్వరూపుడవు. కనుకనే శ్రుణ్వంతు విశ్వే అమృతస్య పుత్ర: అన్నది
(శ్రీవ.1991పు.11)
భూమికంటే కొంత ఎత్తైన ప్రదేశము, అనగా, ఒక ఇంచి రెండు ఇంచిలు ఉండవచ్చును. దాని పై దుర్భచాప, దానిపై కృష్ణాజినము, దానిపై తెల్లటి పలచటి గుడ్డను పరచి, ఆ ఆసనముపై ధ్యానము చేయు వారు పద్మాసనములో కూర్చొనవలెను. కుడికాలు ఎడమకాలు మీద ఉండవలెను. ఎడమకాలు కుడికాలు మీద నుండవలెను. రెండు కాళ్ళునూ ఆసనమును అంటియే యుండవలెను. వ్రేళ్ళను వేళ్ళతో కలిపి, చేతులు ముందుకు వదలవలెను. కన్నులు సగము తెరచి యుంచవలెను. (నిమీలిత నేత్రము) లేక పూర్తిగా మూసుకొనియైననూ ఉండవచ్చును. మానసమున దేహము యొక్క ఒక్కొక్క భాగమున మాలీసు చేయవలెను. మెడ,భుజము,చేతులు,రొమ్ము, వళ్ళు, కడుపు, వ్రేళ్ళు.
వీపు, మోకాళ్ళు, తొడలు, పాదములు, కండరములూ వదలు విడువవలెను. (సళ్లు చేయవలెను) అది అయిన తరువాత తమ తమ ఇష్ట నామమును, రూపమును, ఓంకారముతో జతపరచవలెను. అది చేయు సమయమున మానసికమున ఏ ఆలోచనలూ లేక స్థిమితముగా నుండలెను. గడచిన పాత యోచనలు కాని, కోపతాపములు కాని, దుఃఖచింతలు కాని తలంపునకే రాకూడదు. వచ్చిననూ తలంచకనూ తనకు ఉత్సాహమును కలిగించు భావముల యోచించవలెను. ఇవి ప్రప్రథమున కొంత కష్టముగనే గనుపించును. ఈ రీతి అగు ధ్యానమునకు తెల్లవారు ఝామున (3 గంటల మొదలు 5 గంటలలోపున ఎప్పుడైననూ సరే) 4 గంటలకు లేచిన, నిశ్శబ్దముగా నుండును; సాధనకు ఉత్తమ సమయము. మొదట నిద్రను అరికట్టవలెను. అది అతి అవసరము. కాని కాల, క్రమములు మార్పురానీయ కుండుటకు 4 గంటలకు అలారము పెట్టుకొనవచ్చును. అదియూ సాధ్యముకాక నిద్రవచ్చుచుండిన చల్లనీటిలో స్నానము చేసిన దాని బారి తప్పించుకొనవచ్చును. స్నానము అవసరమని ఏమియు లేదు. నిద్ర ఎక్కువగా ఉండిన మాత్రము చేయవచ్చును.
ఈ రీతిగా ధ్యాన మార్గమును అభ్యాస పరచిన అతి త్వరితముగనే అనుగ్రహమునకు పాత్రులు కాగలరు.
(ధ్యా.వా.పు. 7/8)
(చూ|| అజ్ఞానము, మనసు, దూరంగా ఉంచు)