"నేను సాయిని తెలియుము నిక్కముగము. మమత బాయుము, యత్నముల్ మానుకొనుము. బాసె నాకు మీ తోటి బాహ్యసంబంధమింక, కాదు నను బట్ట ఎటువంటి ఘనునకైన" అని అక్టోబరు, సామవారం 20 వతేదీన ఈ పలుకులు పలికినప్పుడు తమ్మిరాజు కుటుంబము, హనుమంతరావు కుటుంబము, భోజరాజు కుటుంబము, శేషమరాజు కుటుంబము వీరందరూ అనేక విధములుగా అడ్డుపడి "మీరు వెళ్ళకూ డదు" అన్నారు. ఇది ఉరవకొండలో జరిగిన వృత్తాంతము. ఇక్కడ ఎటువంటిదైనప్పటికీ జీవ ప్రజ్ఞతో పాటుగా దైవ ప్రజ్ఞ అని, దైవప్రజ్ఞతో పాటుగా జీవ ప్రజ్ఞ అని ఈ దేహమునకు కొన్ని సంబంధములు దూరము కావలెనన్నప్పుడు ఒక ఆదర్శాన్ని ఒక వైరాగ్యంతో నిరూపించాలి.
ఉరవకొండలో ఉండగా బళ్ళారి నుండి మున్సిపల్ చైర్మన్ రాంరాజా అనే ఆయన వచ్చి స్వామిని చూచాడు. అప్పుడు స్వామిని "రాజు, రాజు " అని పిలిచేవారు. రాంరాజు శేషమరాజును చూచి ఈ విధముగా ప్రార్థించాడు. "ఈ పిల్లవానిని హాలిడేస్ లోపల మా ఇంట్లో పెట్టుకుంటాము. బళ్ళారికి తీసుకొని పోతాము. అంతేకాదు. శేషమరాజూ ! నీవు ఈ బాలుణ్ణి సామాన్యమైన సోదరుడిగా భావిస్తున్నావు. కాదు, కాదు. ఇతని ముఖవర్చస్సు పవిత్రత నా హృదయాన్ని కదిలించి, కరిగించింది. ఇతని లోపల ఏదో ఒక మహత్తరమైన దివ్య తేజస్సు కనిపిస్తోంది. నీవు వేరు విధముగా భావించి మోసపోతున్నావు. నీవు కూడా కొన్ని దినముల పాటు అబ్బాయితో వచ్చి, మా ఇంట్లో ఉండు" అని కోరినాడు.
మున్సిపల్ చైర్మన్ స్వస్థలము నుండి హంపికి మమ్ములను తీసికొని వెళ్ళినాడు. నేను చెప్పబోయే విషయం ఒక అతిశయోక్తి అని కాని, అహంకారమని కాని, మరొక విధమైన వర్ణన అని కాని భావింపరాదు. మాలో వచ్చిన వారందరూ విరూపాక్ష దేవాలయంలో ప్రవేశించినారు. "నేను రాను" అని చెప్పితే వారు నన్ను ఒత్తిడి చేయవచ్చును. కోపము పొందవచ్చును. "నాకు కడుపులో సరిలేదు. నేను లోపలకు రాను" అన్నాను. కాని రాంరాజునకు మాత్రం స్వామి చింతతప్ప అన్యచింతలేదు. కాబట్టి అనేక పర్యాయములు నన్ను చాలా వినయంగా లోపలికి రమ్మని కోరుతూ వచ్చాడు. అప్పుడు నేను చిన్న వాడి నైనప్పటికీ, ఆ మున్సిపల్ చైర్మన్ వచ్చి "ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్, రాజు, రాజు" అని బ్రతిమాలుకుంటూ “తప్పక మీరు రావాలి" అని నా చేతులు గట్టిగా పట్టుకొని బాధపడ్డాడు. కాని నా గట్టితనాన్ని గమనించి, తా నింక ఎక్కువ తొందర పెట్టలేకపోయాడు.
ఆ విరూపాక్షుని గుడిలో పూజారి హారతి ఇస్తున్నాడు. ఆ సమయమందు ఆ గుడిలోపల "అక్కడ విరూపాక్షుడు లేదు. కేవలం రాజు ఉన్నాడు". ఆ దృశ్యమును చూచేటప్పటికి శేషమరాజుకు చాలా కోపం వచ్చింది. రాను గుడిలోనికి రానని చెప్పి. ఎప్పుడో వెనకనుండి పోయి విగ్రహం వెనుక నుంచున్నాడు. ఇది ఎంత పొరపాటు. ఎంత తప్పు అని అతనికి చాలా కోపము వచ్చింది. కాని రాంరాజు ఆ విధంగా భావించలేదు. "విరూపాక్షుడే రాజు, రాజే విరూపాక్షుడు" అనుకొన్నాడు. శేషమరాజు వెంటనే వెనుకకు వచ్చాడు. చూచాడు. నేను చెట్టు క్రింద కనిపిస్తున్నాను. ఆయనకు అనుమానం చాలా ఎక్కువ. రాజు నిజంగా ఆ గుడిలో ఉన్నదీ, లేనిదీ తెలుసుకునేందుకు మరి ఒకరిని పంపి, తాను మాత్రం చెట్టు క్రింద ఉన్న రాజు లోపలకు వెళ్ళకుండా చూస్తూ నిలబడినాడు. కాని రాజు గుడిలోనూ ఉన్నాడు, చెట్టు క్రిందనూ ఉన్నాడు. పట్టరాని ఆనందముతో "రాజు అక్కడా ఉన్నాడు. ఇక్కడా ఉన్నాడు" అని చాలా ఆనందించారు. ఈ విషయాన్ని తిరిగి నా దగ్గర చెప్పితే బాగుండదనుకొని, కేవలం తన మనస్సులో ఉన్న ఆవేదనే, ఈ రీతిగా కని పించినదని శేషమరాజు భావించాడు. అక్కడ నుండి నేరుగా నన్ను బళ్ళారికి తీసుకొని వచ్చారు. బళ్ళారిలో నేను కొన్ని దినములు ఉండి నప్పుడు ఆ మున్సిపల్ చైర్మన్, ఆఫీసర్స్ అందరిని స్వామికి పరిచయం చేయడం చూచి, "ఈ మున్సిపల్ చైర్మన్ ఈ చిన్న పిల్లవానిని ఎందు కింత గౌరవిస్తున్నాడని" కొంత మంది హాస్యాస్పదం చేశారు.
నేను బళ్ళారి నుండి తిరిగి వచ్చే సమయానికి ముందుగా నాకు ఒక చిన్న నిక్కరు, ఒక షర్టు ఆ మున్సిపల్ చైర్మన్ కుట్టించాడు. అప్పటికి నా వయస్సు కేవలం 14 సంవత్సరములు మాత్రమే. ఇప్పుడే ఇంత ఎత్తుగా ఉన్నానంటే, అప్పుడు ఇంకా ఎంత చిన్నగా ఉండేవాడిని? -50 సం పూర్వము యువకులందరికీ ఒక విధమైన ఫ్యాషన్ ఉండేది. "కాలర్"కు ఒక పిన్ను వేసుకొనేవారు. అది "కాలర్ పిన్ను" అనేటటువంటిది. ఇప్పుడా కాలర్ పిన్ ఎక్కడా కనిపించుటలేదు. కాని ఆనాడు కాలర్ పిన్ పెట్టుకొనే వారిని ఒక ఉన్నతమైన స్థానమునకు చెందిన వారుగా భావించేవారు. ఒక్క గంటలో పలనే అతడు కంపాలి దగ్గరకు పోయి "గోల్డ్ తో కాలర్ పిన్" చేయించుకొని వచ్చి, నా కాలర్ కు తగిలించాడు. "రాజు ! ఈ పిన్నును చూచి నప్పుడల్లా, నేను నీకు జ్ఞాపకము రావాలి" అని చేతులు పట్టుకొని ప్రార్థించాడు.
ఉరవకొండలో బస్సు దిగి, ఇంటికి వచ్చాము. రెండవ దినమే స్కూలు ప్రారంభము. నేను స్కూలుకు వెళ్ళుతున్నాను. మార్గమద్యములో కాలర్ పిన్ పోయిన తక్షణమే ఒక బంధన వీడింది అన్నాను. అప్పుడు నే నొక పాట ఈ విధంగా పాడినాను. “అక్టోబరు సోమవారం, 20వ తేదీ, హంపి నుండి వచ్చి స్కూలు కరుగుచు బాబా కాలర్ పిన్నుఒ కటి జారి కనపడలేదు. మార్పు కలిగెను నాడు. ప్రాపంచిక సంబంధము "పినై" తొలగెన్, క్షేత్ర దర్శనము కూడా చెల్లెను. హంపిన్, మాయ తొలగెనని గృహమును వీడెను". ఆనాడే గృహాన్ని విడిచి పెట్టినాను. ఇదొక మాయ, అనగా ప్రాపంచిక సంబంధమైన వస్తువులే ఒక మాయ. ఏ నాడు ఈ వస్తువులు మననుంచి విడిపోతాయో, ఆ నాడే మాయ తప్పడం.
ఆనాడే వెళ్ళి ఆంజనేయుని గృహ మందున్న ఒక పెద్ద గుండు పైన కూర్చున్నాను. అతడొక ఎక్సైజు కమీషనరు. స్వామిని చూస్తే ఆయనకు కూడా ఏమో తెలియనటువంటి ఆధ్యాత్మిక భావనలు కలుగుతుండేవి. నేను స్కూలుకు వెళ్ళే త్రోవలోనే వారి యిల్లు. నా కోసం కాఫినో, పకోడానో, ఏదో చేసి పెట్టుకొని, వారింటి ద్వారము దగ్గర ఆయన, ఆయన భార్య కాచి పెట్టుకొని ఎదురు చూస్తుండేవారు. నేను చిన్నగా వారి ద్వారములోనికి ప్రవేశించేటప్పటికి వారిద్దరూ నాకాళ్ళు పట్టుకొని నమస్కారము చేసేవారు. "సార్! మీరు పెద్దవారు. ఈ విధంగా చేయకూడ”దని ఎంతో చెప్పేవాడిని. “రాజు! కేవలం వయస్సులో మేము పెద్దవాళ్లుగా ఉంటున్నాము. కాని జ్ఞానములో చాలా అల్పులుగా ఉంటున్నాము. నీవు క్షాత్తు కృష్ణుడవే", ఈ విధంగా వాళ్ళు వర్ణించేవారు. అందరి ఎదుట ఆ రీతిగా వర్ణిస్తే వారేదైనా హాస్యము చేస్తారేమో అని, నన్ను ఒంటరిగా పిలిచి చెప్పేవారు.
ఈ 20వ తేది అక్టోబరు సోమవారము. ఆ నాడు ఎక్కడికీ పోలేదు. స్కూల్ కు పోలేదు. ప్రతి దినము ఆ స్కూలులో నేనే ప్రార్ధన చేసేవాడి ని. సర్వ మత సమన్వయంతో కూడిన ఒక ప్రార్థన చేసేవాడిని. "అహరహ తవ ఆహ్వాన ప్రచారిత, సునిత ఉదారవాణిహిందు,బౌద్ధ,సిక్, జైన,పారసీక,ముసల్మాను,క్రిస్థానీ".ఈపిల్లవా డేమిటి? అని టీచర్లు విసుగుపడేవారు. ఆనాడు స్కూలునకు పోకుండా ఉండుటచేత ఎక్కడ రాజు? ఎక్కడ రాజు? అని ఒక పెద్ద విచారణ ప్రారంభమయింది. పిల్లలెవరూ ప్రార్థనలో లేరు. అందరూ ఆ ఆంజనేయుల గృహానికి పరిగెత్తుకొని వచ్చారు. ఎవ్వరిని నేను చూడలేదు.
ఒక గుండుపై నేను ఊర్కే కూర్చున్నాను. "ఏదో మార్పు కలిగింది. లేక మతి భ్రమ కలిగింది. హంపి నుండి రావడం చేత ఇంట్లో ఏమైనా జరిగిందేమో నని పిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఊహిస్తూ వచ్చారు. "నే నెవరో మీరు ఫోటో తీసుకోండి" అని చెప్పాను. ఆ ఫోటో తీసుకుంటే, నా ముందు షిర్టీ బాబా ఉంటున్నాడు ఫోటోలో, ఆనాడు సాయిబాబా అంటే ఎవ్వరికీ ఏమీ తెలియదు. ప్రార్థనచేసి మీరు స్కూలు ప్రారంభించండి అని చెప్పాను.
ఇంతలోపలనే, యింత మార్పు కలిగిందని శేషమరాజు పుట్టపర్తికి టెలిగ్రాం ఇచ్చాడు. టెలిగ్రాం చూసుకొని వాళ్ళందరూ వెంటనే పరుగెత్తుకొని వచ్చేశారు. అక్కడ ఉండకూడదని, పుట్టపర్తికి తీసుకొనిపోవాలని వారంతా వచ్చారు. ఆనాడు బుక్కపట్టణము వరకు బస్సులు లేవు. కేవలం పెనుగొండ వరకు మాత్రమే బస్సు ఉండెడిది. అక్కడ నుండి పుట్టపర్తికి రెండెడ్ల బండిలో రావాలి. ఆనాటి పరిస్థితి ఈ విధంగా ఉంటున్నది. ఈ పిల్లలంతా మేము కూడా రాజుతో వస్తామని బయలుదేరినారు.
ఇక్కడ ఒక విచారకరమైన సంఘటన జరిగింది. పాఠశాల యందు తరగతి గదిలో నేను కూర్చునే బెంచిలో ఒక శిరస్తదార్ కుమారుడు, ఒక రెవెన్యూ ఇన్ స్పెక్టర్ కుమారుడు కూర్చునేవాడు. నేను మధ్యలో కూర్చునేవాడిని, వారిరువురు నాకు ఇరువైపులా కూర్చానేవారు. ఈ విధంగా నాయొక్క దర్శన స్పర్శన, సంభాషణలచేత, వారియందు ఆధ్యాత్మిక భావము అభివృద్ధి చెందినది. నేను బస్సు ఎక్కుట చూచి, శి రస్తదార్ కుమారుడు "రాజు నుండి దూరమైపోతున్నానే" అనే బాధ భరించలేక వెళ్ళి బావిలో పడి మరణించాడు. ఇంక రెవెన్యూ ఇన్స్పెక్టర్ కుమారుడు ఎల్లప్పుడూ "రాజు, రాజు, రాజు" అని కలవరిస్తూ, నిద్రాహారములు త్యజించి, పిచ్చి పట్టి మరణించాడు. ఇది ఒక ఆధ్యాత్మిక భావనలో కలిగే ఉన్మత్తత.
మా స్కూలులో లక్ష్మీపతి అనే హెడ్ మాస్టర్ ఉండేవాడు. ఆ లక్ష్మీపతి నేను స్కూలుకు వచ్చిన తక్షణమే నన్ను అతని ఆఫీసుకు రమ్మని చెప్పేవాడు. నేను లోపలికి వెళ్ళిన తక్షణమే తలుపులు వేసేవాడు. నన్ను తన కుర్చీలో కూర్చోమని చెప్పేవాడు. తాను నా పాదాల చెంత కూర్చుని ఒత్తేటటువంటి వాడు. "సార్! మీరు ఈ విధంగా చేయకూడదు" అని అమాయకుడిగా అతనితో చెప్పేవాడిని. నన్ను చూచి లక్ష్మీపతి ఈ విధంగా అనేవాడు. "ఇవన్నీ నీకు తెలియదు. నాకు తెలుసు. నీలో ఒక పెద్ద శక్తి ఉన్నది "అని పల్కేవాడు. ఆనాడు ఉరవకొండలో యిన్ని విధములైన అలజడులంతా జరిగిపోయినాయి. కాబట్టి ఈ అక్టోబరు 20వ తేది అంటే, ఆ ఉరవకొండకు పూర్తిగా మార్పు తెప్పించిన దినము. అంతేకాదు విద్యార్థులందరిలోనూ గొప్ప మార్పు కలిగింది. వారి ఆప్యాయత, ప్రేమతత్వము, నాపైన ఎంత పెరిగిందంటే ఒక చిన్న ఉదాహరణ చెపుతున్నాను. నేను స్కూలు విడిచి వచ్చిన రెండవ దినం, క్రొత్త పిల్లవాడు ప్రేయర్ప్రారంభించినాడు. ఇంతలో స్వామి జ్ఞాపకము వచ్చి, గట్టిగా ఏడ్చేసాడు. ఆ పిల్లవాడు ఏడ్చేటప్పటికి అందరూ ఏడ్చేసినారు. ప్రేయర్ అంతా ఏడుపుకింద మారిపోయింది. “ఇంక ప్రేయర్ వద్దు! లోపలికి పోదాం పదండి "అన్నాడు-ఇదే మన ప్రేయర్ అతని నిమిత్తమై ఏడ్చినటువంటి ఏడ్పే మన ప్రేయర్. ఆనాటితో, ఆ రూముకు పూర్తిగా తాళం వేసి, ఒక పెద్ద "షోరూం "గా తయారు చేసుకొన్నారు.
(స.సా.శ. 90 పు 299/303.)&