భారతము పంచమ వేదం. అది ఐహిక, ఆముష్మిక ధర్మాల నిధి. మాధవుడు భారతదేశ ధర్మక్షేత్ర రంగస్థలంలో, తన నాటక సామాగ్రిని దింపుకొని ఆడిన అద్భుతమైన ఆట మహాభారతము. భారత నాటకానికి పాత్రధారులను, మాటలు, పాటలను సమకూర్చిన రచయిత, నటకుడు, దర్శకుడు, నిర్మాత అంతా ఒక్క మాధవుడే! ఒకవైపున ధర్మవృద్ధియైన పరిమిత ఆత్మబలం, మరొకవైపున అధర్మవృద్ధమైన అపార భౌతిక బలం. ఈ రెంటి ఘర్షణలో, పర్యవసానరూపమైన ధార్మిక విజయజ్యోతిగా, తనను నిర్దేశించుట, ఇదే భారతామృత సర్వస్వం. అదే భగవద్గీత.
(శ్రీ భ.ఉ.పు.2)
మహాభారతము, భాగవతము వలెను, రామాయణము వలెను, భక్తి బోధకము కాదని పలువురనుట కలదు. కాని, ఒకమారు దాని రుచి తెలిసికొన్న వాడు దానిని వదలడు. దానికి తక్కువ విలువయు కట్టడు. భారతము పంచమవేదముగా పేర్కొన బడినది. ఎందువలనననగా వేదములు ప్రతి పాదించు పరమార్ధములు సామాన్య బుద్ధులకు సులభ గ్రాహ్యములు కావు. అట్టి యర్థములను మహాభారతము మనోరంజకములయిన చిన్న చిన్న కథల రూపమున ప్రజల కందించి, యాచరణ సాధ్యములు కావించినది. అందువలన పంచమ వేదమనబడినది.
పూర్వమీమాంస ప్రవృత్తి మార్గమును తెలుపుము ఉత్తరమీమాంస నివృత్తి మార్గమును తెలుపును. పూర్వ మీమాంస కారణముమ, ఉత్తర మీమాంస కార్యమును (అనగా -జ్ఞానమున) తెలుపును. మహాభారతములో ఆరెండు మార్గములును సమగ్రముగా వివరింపబడియున్నవి. కావుననే పంచమ వేదముగా భావింపబడినది. అది వేద సారము, భారతము కమ్మకమ్మని కథలతో, సులభమైన భాషలో - మానవుని యిహలోక యాత్రకును పరలోక ప్రాప్తికిని కావలసిన సకల ధర్మలను బోధించును. ఆందువలననే "వింటే భారతమే వినవలె తింటే గారెలే తినవలే "నన్న లోకోక్తి పుట్టినది.
(సా.స.వ.పు.6)