జీవిరూపుడైన జడము బ్రహ్మజ్ఞానమను చైతన్యమును వరించును. ఆ బ్రహ్మజ్ఞానచైతన్యమే సీత అను పేరున పుట్టినది. అప్పుడు ఈ జడచైతన్యములు ఒకటిగా ఏకమగును. వాటినే సీతారాములమ పేర్లతో సంబోధించు చున్నారు. ఈ రెండూ ఏకముగా ఉన్నంతకాలమూ ఏబాధలూ ఉండవు. ఈ రెండింటి యొక్క యెడబాటే కష్ట ప్రారంభము.
బ్రహ్మజ్ఞాన మను సీత, జీవిరూపమందున్న ఆత్మను వదలిన అంధకార మను జీవిత అడవిలో పడకతప్పదు. జీవి బ్రహ్మాజ్ఞాన మను సీతను పోగొట్టుకొనుటవల్ల అంధకార మను ఆడవిలో సంచరించక తప్పదను అర్థమును చూపుట కొరకే రాముడు అట్లు నటించినాడు. ఆట్టి అంధకారమైన జీవిత ఆడవిలో వంటరిగా వద్దు, మనస్సు అనే లక్ష్మణుని ఎడమీయక ఉండ మని తెలిపినాడు.
అట్టి అంధకారజీవితములో సంచరించు సమయమున దీనత్వము, వివేకము అనేవి రెండూ వైరములో ఉండుననియూ, అట్టి సమయమున దీనత్వమను వాలిని తెగటార్చవలెననియూ చూపినాడు. ఆ దీనత్వవివేకములే వాలిసుగ్రీవులు. దీనత్వమే వాలి, వివేకమే సుగ్రీవుడు. దీనత్వమును తెగటార్చుటకు తగిన సహాయకారి. అతనే ధైర్యమను రూపమున ఉన్నాడు. ఆ ధైర్యమను హనుమంతుని విశ్వాసము చేసికొనునటువల్లనే మోహసాగరమును సప్తసముద్రములనూ జీవి సులభము గా దాటగలడను నిశ్చయమును చూపుతూ లంకకు హనుమంతునితో సేతువుకట్టించినట్లు చూపినాడు.
రాముడు (సేతువు దాటి)మోహమును దాటిన తక్షణము రజోగుణతమోగుణము లను రావణుని, కుంభకర్ణుని చంపివేసెను. మిగిలిన చిన్న తమ్ముడైన సత్వగుణము అనగా విభీషణునకు పట్టముగట్టెను. కాన, మూడు గుణములనూ ముగ్గురు అన్నదమ్ములవలె చూపి, వారినే రావణ, కుంభకర్ణ, విభీషణులను పేర్లలో చూపించినాడు. తరువాత అనుభవజ్ఞానమైన సీత అను చైతన్యమును చేరుట: ఎప్పుడుతిరిగి జడ చైతన్యములు చేరునో అదే పట్టాభిషేకము అనగా జీవన్ముక్తి. కాన, రామాయణములో సారమేమన, మానవునియందున్న జీవి, మనసూ, జ్ఞానమూ, దీనత్వము, వివేకము. మోహము, ధైర్యము, రజస్సు, తమస్సు, సత్వము వీటిని ఒక్కొక్క దానిని ఒక్కొక్క రూపనామముగా సృష్టించి, ఏఏ రీతిగా జయించవలెను. సాధించవలెను. అను విధానమును ఆత్మస్వరూపుడు రామస్వరూపమున వచ్చి నటించి, నడిపించి, చూపించి, చేపించి నాడు. కాన, ఆనాటితో రామాయణము ముగియలేదు. ఎవరెవరిజీవితము ఇన్ని మార్గముల సాధించి, కడకు అనుభవజ్ఞానమును పొంది, సత్వగుణమునకు పట్టము కట్టుదురో అంత వరకూ వారివారి హృదయభూమియందు రామాయణము జరుగుచునే యుండును.
జీవితరామాయణమున ఆత్మే రాముడని, మనస్సే లక్ష్మణుడు, బ్రహ్మజ్ఞానమే సీత అనియూ, ఆ సీతము రాములు వదలిన, జీవితమను అడవిలో పడుదురనియు,ఆ జీవిత మను అడవిలో దీనత్వ, వివేకములను వాలిసుగ్రీవులుందురనియూ, దీనత్వమను వాలిని హతమార్చవలెననియూ, అప్పుడు మోహమను సముద్రము అడ్డువచ్చుననియూ, వాటిని దాటుటకు ధైర్య మను హనుమంతుని సహాయముగా ఉంచుకొనవలెననియూ, ఆ ధైర్యమను హనుమంతుని మనము చెలిమిచేసిన వాని సైన్యమైన ఉత్సాహ బల స్ధైర్యగాంభీర్యములను జాంబవంత అంగదాది సైన్యములతో మోహమును దాటవచ్చు ననియూ, అది దాటిన తక్షణమే రజోగుణ తమోగుణము లను రావణ కుంభకర్ణులను హతమార్చవచ్చుననియు, మిగిలిన సత్వగుణమను విభీషణునికి పట్టాభిషేకము కట్టవలెననియూ, తరువాత అనుభవజ్ఞానమైన సీతను చేరవచ్చుననియూ, ఆ జడ చైతన్యమైన సీతారామ చేరికే ఆత్మానందమనియూ, అదే జీవమ్మక్తి. దశరథ కుమారుడై జరిపిన రామాయణమునే ఆందరిహృదయములందు పై చెప్పిన గుణఇంద్రియ రూపములతో సూక్ష్మ రామాయణముగ జరుపుచున్నాడు.
(స.వి.పు. 89/92)
(చూ: దశేంద్రియములు)