అర్జునా! కర్మలను కర్తవ్యముగా నెంచి, నా మాటలయందు సంపూర్ణ విశ్వాసముంచి, ఫలాపేక్షను దృష్టియందుంచు కొనక చెప్పిన కర్మలు చేయుము. అపుడు నీవు నిష్కామ కర్మను ఆచరించిన వాడగుదువు, నీవు ఫలాసక్తిని వదలుటవలన జ్ఞాన నిష్టాత్మకమగు మోక్షమును పొందుదువు, అర్జునా ఈశ్వరార్పణ బుద్ధితో కర్తృత్వమును ఫలాపేక్షను వదలి కర్మలు చేయువానిని యే పాపము కూడనూ యేమియూ చేయలేదు. బావా! కంటి కాటుక గ్రుడ్డునూ, నీరు తామరాకునూ అంటనట్లు నిష్కామకర్మయోగి యెట్టి కర్మ చేసినా, చూచినా, వినినా, తానేమియూ చేయనివాడే అగుచున్నాడు. బాహ్యమైన విషయ భోగములు సుఖదుఃఖములకు దారితీయును; అవి క్షణికములు. నీవు వీటన్నింటికి అతీతమైన ఆత్మస్వరూపుడవు; నీవు స్వయముగా జ్ఞానస్వరూపుడవు, ఈ కర్మలతో నీకెట్టి సంబంధములేదు. అన్నింటికి నీవు కర్తవు కాదు; సాక్షివి, కాన ఈ అభిమాన మమకరాములను భ్రాంతితో నీవీ సంశయములకు గురి అయినావు. నీవు బ్రహ్మజ్ఞానివి కమ్ము, సర్వ కర్మలూ చేయుచూ ఫలమును మాత్రము త్యాగము చేయుము. కర్మత్యాగము కంటే కర్మఫల త్యాగమూ, కర్మ సన్యాసముకంటే కర్మయోగ మెంతో పవిత్రమైనవి. ఈ రెండింటి కెంటెనూ ధ్యాన యోగము మరింత శ్రేష్టమయినది.
ధ్యానయోగమునకు కర్మయోగము యొక్క తోడ్పాటు అవసరము! కనుకనే కర్మయోగమును ముందుగానే తెలుపవలసి వచ్చినది. అర్జునా ! ఫలమును వదలి కర్తవ్య కర్మ చేయువాడు నాకు అత్యంత ప్రియుడు. అట్టివాడే నిజసన్యాసి. అంతే కానీ, అగ్నులను వదలి పని పాటలను మాని పరమ సోమరులవలె తిని, నిద్రించి, ఇంద్రియ విషయములను ఆశించుచు కుంభకర్ణుని సోదరులైనవారు నాకేనాటికి ప్రియులుకారు. సోమరులకు నేను చాలా దూరము. సంకల్పములను సన్యసించని వాడు యెన్ని సాధనలు చేసిననూ యోగి కాలేడు. శబ్దాది విషయము లందునూ కర్మల ఫలములందునూ తగులుకొననివాడు సర్వసంగ పరిత్యాగికాగలడు. ఇట్టి నిష్కామ కర్మల వలననే ధ్యాన యోగమును సాధింపవచ్చును. అజ్ఞానవర్తికాని చిత్తమే తనకు పరమ శత్రువుగా మారును. కనుక నీవు జితేంద్రియుడవు కమ్ము, ఏకాంత వాసము చేయుము. చిత్తేంద్రియములను వశపఱచుకొనుము. కళ్ళెములేని గుఱ్ఱము, కాడి పెట్టనివ్వని యెద్దు, ఇంద్రియములు వశము చేసుకోలేని సాధనా, నీరులేని నది వంటివే, ని ఫ్రయోజన కర్మలు.
అర్జునా లెమ్ము! ధ్యానయోగమును అభ్యసించుము; క్రమము తప్పక, కాలము మార్చక, స్థానమును వీడక, మనసును అరికట్టుటకు పూనుకో. ఈ యోగమునకు క్రమము ప్రధాన అంగము; దానిని అతి జాగ్రత్తగా పాటించవలెను. ఇష్టమొచ్చినట్లంతయూ పద్ధతులు మార్చకూడదు అది ప్రమాదమునకు గురియగును. అతిగా తిని ఆయాస పడువానికీ, తిండే తినక దేహమును కృశింపచేయువానికీ, అతిగా నిద్రించువానికీ, అసలే నిద్రలేక నిరంతరము మెలకువతో నుండు వానికి అనుకూలమునుబట్టి ధ్యానమును ఆచరించువానికీ కామ క్రోధాది షడ్గుణములను విచ్చలవిడిగా ఉపయోగించు వానికీ, తల్లిదండ్రుల యొక్క హృదయములను హింసించు వానికి మాతృదేవి హృదయమును సంతృప్తి చేయనివానికీ వీటన్నింటికంటే అతి ముఖ్యమయినది, భగవంతునియందు గాని లేక యెవరిని గురువుగా, దైవముగా భావించి హృదయమును ఆర్పితము చేసెనో, అట్టి వారలపై సంశయములు, అవిశ్వాసములు ప్రదర్శించువానికీ, యెన్ని యుగములు ధ్యానము చేసినా ఫలసిద్ధి కాజాలదు. యోగభ్యాసము చేయువాని చిత్తము గాలిలేని స్థానమున దీపము ఉండినట్లు నిశ్చలముగా వుండవలెను. ఏయే సమయమున మనసు చలించునో అప్పటికప్పుడే దానిని నిశ్చలముగా పరుగెత్తనీయక అరికట్టుటకు ప్రయత్నించ పలెను. అన్నింటియందూ నేనే యున్నానను భావమును, సర్వభూతములూ నాయందే యున్నవను యేకత్వమునూ, పొందువాడూ అన్ని యోగములనూ సాధించును. అట్టివానికి పరులనియూ, పరమాత్మ అనియూ, భేదము లేకుండును. ఇతరుల సుఖదుఃఖములు తనవిగా భావించును ఇతర హృదయములను బాధింపజేయక సర్వులనూ సర్వేశ్వర భావమున ప్రేమించును. ఇట్టి భావము గలవాడు యోగులలో శ్రేష్ఠుడు".
(గీ.పు.96/98)
బుద్ధిపూర్వకముగా ఫలాసక్తి వదలి చేసిన కర్మనే నిష్కాము కర్మ అని అందురు. అదే బుద్ధియెగం. బుద్ధి నిర్మలము కానిదే ఫలాసక్తి వదలేది వీలుపడదుకదా! కాబట్టి దానినే యోగబుద్ధి అని కూడనూ అందురు. దీని సహాయముతోనే నీవు కర్మబంధాలను వదలించుకో, నీవు కర్మాతీతడపు కమ్ము, పోనీ అసలు బంధనలను కలిగించే కర్మలు చేయకుండా వుందామని తలంచిన అది సాధ్యము కాదు. అసలు కర్మచేయక ఉండుటకు వీలులేదు. అది యెట్టివారి చేతనూ కాదు. అందుకనే గీతలో కృష్ణుడు మూడవ ఆధ్యాయములో "నహి కశ్చిత్ క్షణమపి" అని అంటున్నాడు. “అర్జునా! కామ్యకర్మములకు అధిక్రమ నాశమున్నది. నిష్కామకర్మలకు అభిక్రమము లేదు. ఇదియే సకామ నిష్కామ కర్మలకు భేదము. కామ్యకర్మ శిక్షకు కూడనూ సిద్ధము కావలసివుండును. నిష్కామ కర్మకు అట్టి శిక్షలు వుండవు. ఫలాపేక్ష సంసార హేతువు. ఫలత్యాగము మోక్షము హేతువు. నిష్కామకర్మ యోగమార్గమును అనుసరించువాడు ఆ జన్మలోనే సిద్ధిని సాధించలేక పోయిననూ చేసిన కర్మ వ్యర్థము కాదు. దాని ఫలము తరువాత వచ్చు జన్మమునందైననూ ఫలించును. తన లక్ష్యాన్ని అవశ్యం సాధించవచ్చును. కనుక కర్మయందే అధికారుముంచుకో, కాని కర్మఫలమందు అధికారము వుంచుకొనవద్దు.
"బావా! ఫలాపేక్ష రజోగుణ సంబంధము. అది నీకు సరి గాదు. ఫలం వదలమంటే కర్మనే మానదువేమో! అది మరింత మోసము, అది తమోగుణ లక్షణము. జాగ్రత్త ! ఇక్కడ భగవంతుడు నాలుగు ఆజ్ఞలు పెట్టినాడు. మొదటిది విధాయకాజ్ఞ, తక్కినమూడుము, నిషేషధాజ్ఞలు; మొదటిది గుణనిరూపణ సంబంధము, రెండవది దోషనిరూపణ సంబంధము. కాని మానవుల కందరికీ కర్మయందధికారము కలదని భావించవలెను. ఒక అర్జునునికే కాదు.
అర్జునుని మానవ ప్రతినిధిగా భావించవలెను. అదియే గీతాపాఠకులు మొదట గమనించవలసిన విషయము. ఇందులో మరొకటి తెలిసి కొనవలెను; యేమన, కర్మాధికారము మానవులకే కానీ, పశుపక్ష్యాదులకూ దేవతలకూ కాదని. దీని అర్థము. లోకమున ప్రతి మానవుడూ ఫలాన్ని కోరే కర్మలు చేయును; ఫలమే లేదన్న అసలు మానవుడు కర్మనైననూ వదలును కానీ ఫలము లేక యేకర్మయునూ చేయుట లేదు: ప్రతి కర్మకూ మానవునకు లాభము అవసరము కానీ మన గీతాపానము చేయు వారలకు ఇది అన్వయింపదు. సామాన్య మానవుల మనస్సులు అట్టి ఫలాపేక్షకు పాల్పడవచ్చును. మోక్షాపేక్ష కలవారు కర్మలు చేయుచు ఫలమును భగవదర్పితము చేయవలెను; అది శాంతిని చేకూర్చును. .
ఫలాపేక్ష అశాంతిని అందించును, ఫలమునే వదలిన జీవించుటెట్లు అని తలంతురేమో, అంత దౌర్బల్యమెందుకు! ఎవరు "యోగ క్షేమం వహామ్యహం" అని అన్నారోవారే చూచుకొందురు. జీవితానందము ప్రధానమా? మోక్షానందము ప్రధానమా? జీవితానందము క్షుద్రము, మోక్షానందము నిత్యము, భద్రము! ఈ విషయములో అనేక మంది వ్యాఖ్యానికులు వారి వారి బుద్ధి కుశలతను బట్టి వ్రాతలు వ్రాసిరి. అందులో అధిక సంఖ్య ఫలాపేక్ష అనగా ఫలమును కోరుటకు మానవునకు అధికారము లేదు అని తెలుపుచుందురు.
ఇది వ్యాఖ్యానికులు పడిన పెద్ద పొరపాటు. భగవంతుడు గీతలో "మా ఫలేషు" అన్నాడు. అనగా ఫలము వద్దు అనిదాని అర్థము. మా అనగా “వద్దు" అంటే ఫలమేమోవున్నది; కాని నాకు వద్దు అని దానిని వదలుట, దీని భావము. వ్యాఖ్యానీకులు వ్రాసినట్లు అధికారము లేదు అని అనియుండిన కృష్ణ పరమాత్మ "నఫలేషు" అని అనివుండవలెను కదా! న అనగా లేదు అని, "మా ఫలేషు "కు "న ఫలేషు అనుటలో భగవత్ వాక్యమును కూడనూ మార్చినవారగుదురు. అట్టిది మహాపరాధము.
కర్మ చేయుటకు అధికారమున్నప్పుడు కర్మ ఫలమునకు కూడనూ మానవుని కధికారమున్నది. లేదని చెప్పుటకు సాధ్యము కాదు; వీలులేదు కాని; ఇష్టముతో కర్మఫలమునువదలవలెననియే దీని అర్థము అందుకనే గీత ఒక మార్గము తెలిపినది; "పనిచేయి : ఫలము వదలు" ఫలాపేక్ష రజోగుణము. ఫలము లేదని, పనే మానిన తమోగుణము. కాని పని చేసి ఫలమును వదలిన అది సత్వగుణమగునని దివ్యమార్గము చూపుతున్నది!
(గీ.పు.34/37)
(చూ|| భగవంతుని అనుగ్రహం)